ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు తొమ్మిది రోజులను దేవీ నవరాత్రులు అని దసరా పండుగ అని వ్యవహరిస్తారు. ఈ పండుగను జరుపుకొనుటకు కారణ ములనేకము. ముఖ్యముగా మహిషాసురుడు అనే రాక్షసుడు అతి గర్విష్టియై దేవతలను, మానవులను కష్ట పెట్టు చుండెను. ఈ రాక్షసునికి పురుషుని చేతిలో చావు లేదని బ్రహ్మ యొక్క వరమున్నది. ఈతడు సర్వులను బాధించుటచేత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పార్వతీ మాతకు వారి శక్తి నంతా ఇచ్చి మహిశాసురునితో యుద్దమునకు పంపిరి. ఆ దేవి తొమ్మిది రోజులు యుద్దము జరిపి, పదవ రోజున ఆ రాక్షసుని సంహ రించెను. ఈ తొమ్మిది రోజులు ఆలయములలో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకముగా అలంకరించి నవరాత్రోత్సవములుగా జరుపుతారు. అష్టమి, నవమి, దశమి రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ మూడు రోజులను దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిగా వ్యవహరిస్తారు. అష్టమి నాడు పార్వతీ దేవి దుర్గగా అవతరించి, నవమి నాడు ఆ అసురునితో పోరాడి, సంహరించి యుద్దములో విజయం సాధించెను. కావున దశమి నాడు విజయదశమిగా చెపుతారు.
ఉత్తర ప్రాంతీయుల భాషలో దస్ అనగా పది, హరా అనగా పండుగ కావున దీనిని దసరాగా పిలుస్తారు. ఈ దసరాలలో కన్నె ముత్తైదువులను (పెళ్లి కాని ఆడపిల్లలను ) పిలిచి భోజనము పెట్టి బట్టలు పెట్టుట హిందూ సాంప్రదాయము కలదు. ఈ రోజులలో పూజలు నిర్వహించు వారు తొమ్మిది రోజులు ఉపవాసము ఉండి, ఒక పూట భోజనము స్వీకరింతురు. పది రోజుల తరువాత దుర్గా మాతను ఊరేగింపుగా తీసుకు వెళతారు. ఈ సమయములో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.దేవాలయములలో ఈ దినములలో పండితులైనవారు ఉపన్యాసములతో ను,ఆధ్యాత్మిక చింతనలతోను ప్రజలను సన్మార్గమున నడిపించుటకు సహకరించెదరు. విజయదశమి రోజున ఆరంభించిన పనులన్నీ విజయము సాధించునని పురాణ, ఇతిహాస ప్రసిద్దమైన కథలలో ప్రచారములో ఉన్నది. పెద్దలు కూడా చెబుతారు శ్రీ రాముడు రావణాసురుని సంహరించి యుద్దంలో విజయం సాధించాడు కావున దీనిని విజయదశమిగా వ్యవహరిస్తారు. దక్షి నాది వారు (ఆంద్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక ) ఈ నవరాత్రులలో బొమ్మలు పెట్టి బొమ్మల కొలువు అనే ఉత్సవము కూడా నిర్వహిస్తారు. దుర్గా మాతయే ఈ రోజులందు లక్ష్మి, సరస్వతి, పార్వతిగా కీర్తిన్చాబాడును. ఈ విధంగా దసరా ప్రాశస్త్యము అన్ని పురాణ, ఇతిహాసములలోనూ ఉన్నది.
మీ స్నేహపరిమళ ఆస్వాదనలో...
మీ మిత్రుడు ( ప్రవరాఖ్య )
నవరాత్రుల మరియు దసరా పండుగ శుభాకాంక్షలు
Aucun commentaire:
Enregistrer un commentaire